Read More ->>
అతని కలం మనకి ఓ కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది,
అతని కవిత ఆ ఊహాలోకంలో మనల్ని విహరించేలా చేస్తుంది,
అతని స్పర్శకి పదం పులకరిస్తుంది,అతని కవితకి గళం పలవరిస్తుంది.
ఆతని కవితకు మావిచిగురుల కోయిలమ్మ, మన విరులతోటన తేటతెలుగు పాట పాడుతుంది.
అతని గురించి ఎంత చెప్పినా తక్కువనిపిస్తుంది, ఇంకా ఏదో చెప్పాల్సింది మిగిలే ఉందనిపిస్తుంది.
అతను ఆకులో ఆకుగా , పూవులో పూవుగా , కొమ్మలో కొమ్మగా నునులేత రెమ్మగా తెలుగుకవిత్వంలో చిరస్తాయిగా నిలిచి పోయాడనిపిస్తుంది
మన మనసే, మనతో మూగగా ఏదో చెప్తున్నట్టు,
అతని కవిత ఒక్కోసారి గోముగా మన గుండెల్లో తిష్ట వేసుకు కూర్చుంటుంది.
గారంగా, మురిపెంగా గుప్పెడు గుండెతో గంటలకొద్దీ మాట్లాడేస్తుంది.
మనసు తనభావాల్ని తనే, తనెదురుగా పరచుకున్నట్టు,
ఆయన ప్రతీ కవితని అరచేత పొదిమి పట్టుకుని,
ప్రియమార ప్రతీ భావాన్ని పలకరించి మరీ పరవశిస్తుంది.
మనకు తెలీకుండానే అతని వశమైపోతుంది..
అతనో ప్రకృతి..
అతనో ఆకృతి.
గుండెల్లో భావాల్ని గువ్వల్లా స్వేచ్చగా విహరింపచెయ్యటం అతని నైజం.
స్వేచ్చాగాన ఝరులతో విశ్వాన్ని మేల్కొలిపే ఘనాపాటి అతను.
"నిశిరాత్రి , నక్షత్రాలనే పూలను పెట్టుకున్నట్టు,
రాటుదేలిన శిలలు కూడా శిల్పాల్లా మారేట్టు,
ఎండిపోయిన చెట్లుకూడా చిగురులెత్తి మురిసిపోయేలా
ప్రపంచానికి వినపడేలా స్వేచ్చగా నాగళాన్ని వినిపిస్తా" నని చెప్తూ
కుటిలమైన, క్రూర దాస్య శృంఖలాలు తమంతనే తాము చెరిగిపో వని కర్తవ్యాన్ని భోదిస్తాడు.
"యుగయుగాలుగా స్వేచ్చకోసం, ప్రాణాల్ని అర్పించిన యోధుల
నిష్కల్మష జీవితం ధన్యమయ్యేల్లా,
వారి ఆశయాల్ని ప్రపంచానికి చాటిచెప్పటం కోసం
తన గళప్రవాహాన్ని ప్రపంచానికి వినపడేలా స్వేచ్చగా వినిపిస్తా" నని చెప్తూనే
భయాన్ని కల్గించే మనసుని వదిలి,
అంతమనిపించే శోక రాత్రులను మరిఛి
ప్రపంచం పరవశమై వెంటవచ్చేలా, మృదువుగా తన గొంతు వినిపిస్తా" నని భరోసా ఇస్తాడు.
భావకవిత్వం తన గొంతు సవరించుకుంది ..తెలుగు కవిత్వం తన ఉనికిని విస్తరించుకుంది అతని రాకతో !..
భావకవిత్వాన్ని ఓఉద్యమంలా ముందుకునడిపినా, కృష్ణపక్షానంతరం, ప్రవాసనం చేసినా, తన కలల ఊర్వశిని తానే సృష్టించుకున్నా అతనికే చెల్లింది. ,
ఎప్పటికీ మూగబోని కలం
పొద్దుపొడిచిన భావకవిత్వపు తొలికిరణం .. కృష్ణశాస్త్రి.. దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి...
( సశేషం)